అత్యవసర సమయంలో ఆకలితో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్న మురళీకృష్ణ ఆలయ అసోసియేషన్ సభ్యుల సేవలు అభినందనీయమని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. నిర్మల్ లోని కోయ్యబొమ్మల కేంద్రం వద్ద నిర్మల్ గ్రామీణ సిఐ శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహంతో మురళీకృష్ణ ఆలయ అసోసియేషన్ సభ్యులు కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ పి పాల్గొని ప్రసంగించారు. చిత్రాలకు జీవం ఉట్టిపడేలా చేసే నిర్మల్ పెయింటింగ్ కళాకారులు లాక్ డౌన్ కారణంగా పనులు లేక వ్యాపారం సాగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకొని వారికి నిత్యావసర సరుకులు అందించేందుకు ముందుకు వచ్చిన మురళిక్రిష్ణ ఆలయం అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎస్ పి పేర్కొన్నారు. దాదాపు 50 మంది నిర్మల్ పెయింటింగ్ కళాకారులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
గత కొన్ని రోజులుగా ఆలయ కమిటీ అసోసియేషన్ వారు తోచిన రీతిలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారని తన చేతుల మీదుగా ఆకలితో ఉన్న వారికి సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో దాతలు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, నిర్మల్ గ్రామీణ/సొన్ సిఐలు శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, మురళిక్రిష్ణ ఆలయం అసోసియేషన్ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.