కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు వంద రూపాయలకు పైగా పెంచి చరిత్ర సృష్టించిందని సూర్యాపేట జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీని అభినందించాలని ఆయన ఎద్దేవా చేశారు. చరణ్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఉల్లిగడ్డల ధరలు మాత్రమే పెరుగాయని, పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్,నిత్యావసర వస్తువుల ధరలు పెంచి చరిత్రలో ప్రజలపై మోయలేని భారం మోపిన ఘనత మోడీదే అని ఆయన అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి ఐ టి యు కార్యాలయం వద్ద రైస్ మిల్లు దినసరి కూలీల గేట్ సమావేశంలో రోషపతి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలతో రైతులు ఆందోళనలో ఉన్నారని,4 కోడుల చట్టాల సవరణతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని, బిజెపి పాలనలో సామాన్యుడు బ్రతుకు ఆందోళనమైందని అన్నారు,
రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హుజూర్ నగర్ పట్టణంలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంచుతామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని, రహదారి పక్కన ఉన్న ఇండ్లను రోడ్లు వెడల్పు, మిషన్ భగీరథ పనులు వల్ల ఇండ్లు కోల్పోయిన వారికి తక్షణమే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్క సోమయ్య గౌడ్,గుండెబోయిన వెంకటేశ్వర్లు,దిన కూలి యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు సాముల కోటమ్మ, గోపమ్మ, మంగమ్మ, రాములమ్మ,వెంకట పద్మ, తదితరులు పాల్గొన్నారు.