మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. అసైన్డ్ భూముల వ్యవహారంపై కలెక్టర్ హరీష్ సమగ్రంగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు.
దాదాపు 66 ఎకరాల అసైన్డ్ భూములను ఈటల కబ్జా చేసినట్టు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. జమున హ్యాచరీస్ ఆధ్వర్యంలో కబ్జా చేసిన భూములు ఉన్నట్టు కలెక్టర్ నివేదిక ఇచ్చారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూకబ్జా జరిగినట్టు అధికారులు తేల్చారు.
బడుగు, బలహీన వర్గాలకు చెందిన 66 ఎకరాల ఒక గుంట అసైన్డ్ ల్యాండ్ కబ్జాకు గురైనట్టు నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు రైతుల అనుమతి లేకుండా జమున హ్యాచరీస్ కోసం రోడ్డు వేసినట్టు నివేదికలో పేర్కొన్నారు.
మొత్తం 22 మంది రైతులు ఈటలపై ఫిర్యాదు చేశారు. కబ్జా చేసిన భూముల్లో ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్టు, వాల్టా చట్టానికి విరుద్ధంగా చెట్లను తొలగించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హ్యాచరీస్ ఫౌల్ట్రీ షెడ్డులు నిర్మించారు. వ్యవసాయ భూమిలో నాలా చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని నివేదికలో పేర్కొన్నారు.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను కూడా ఎగ్గొట్టినట్టు నివేకలో తేల్చారు. అసైన్డ్ భూములను అమ్ముకోవడానికి వీలు లేదు. అలాగే ఈ భూములను కొనుగోలు చేయడం నేరం. తెలిసి చేసిన తెలియక చేసినా కూడా దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
ఈ విషయాలు అన్నీ తెలిసిన ఈగల రాజేందర్ మంత్రి పదవిని దుర్వినియోగం చేసినట్లు స్పష్టమవుతుందని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అందించిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
దాదాపు 60 ఎకరాలు అసైన్డ్ భూమి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు కబ్జాలు చేసి స్వాధీనం చేసుకున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించడంతో దీనిపై కూడా ఈటల రాజేందర్ పై కేసు నమోదు చేసి చట్టపరంగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.