బాపూజీ కలలు కన్న తెలంగాణ ఇంకా రాలేదు కొండా లక్ష్మణ్ బాపూజీ కలలు కన్న తెలంగాణ రాలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు అదిలాబాద్ నియోజక వర్గంలో పర్యటిస్తున్న ఈటల రాజేందర్ నేడు అదిలాబాద్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సీఎం బాపూరావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్, బీజేపీ నాయకులు సుహాసిని, అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మూడు తరాల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ అదిలాబాద్ జిల్లా వాంకిడిలో పుట్టి హైదరాబాద్ లో న్యాయవిద్య అభ్యసించి చాలా సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశారని ఈటల తెలిపారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ 1952లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని గడ్డి పొచలా త్యజించిన గొప్పవారు. నమ్మిన సిద్ధాంతం కోసం కొట్లడారు. చేనేత కార్మికుల హక్కుల కోసం నిత్యం పోరాడారని ఈటల అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జలదృశ్యం ఇంటిని తెలంగాణ ఉద్యమం ఆఫీస్ కోసం ఇచ్చారు. ఆ వయసులో కూడా త్యాగం చేశారు.
తెలంగాణ చూసే చనిపోవాలని అని యువతకు ఆదర్శంగా నిలిచారని ఈటల అన్నారు. ఎముకల కోరికే చలిలో 97 సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో దర్నాలో పాల్గొన్నారని ఈటల గుర్తు చేశారు. వారు చనిపోయి 10 ఏళ్లు అయ్యింది కానీ చేనేత కార్మికుల బ్రతుకులు మారలేదని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. బీజేపీ చేనేత కార్మికులకు అండగా ఉంటుందని ఈటల హామీ ఇచ్చారు.