2023 తరువాత నువ్వు ఉండవు.. నీ అధికారం ఉండదు అంటూ ప్రత్యక్షంగా మంత్రి గంగుల కమలాకర్ ను పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ పై పలు ఆరోపణలు చేశారు. తోడెళ్ళలా దాడులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రిగా సంస్కారం, సభ్యత ఉండాలి. బిడ్డా గుర్తు పెట్టుకో ఎవడు వెయ్యేళ్ళు బ్రతకరు. అధికారం శాశ్వతం కాదు. హుజురాబాద్ ప్రజలను వేధిస్తున్నవు. బిల్లులు రావు అని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నవు. కరీంనగర్ ను బొందల గడ్డ చేస్తున్నావు. నువు ఎన్ని టాక్స్ లు ఎగగొట్టినవో తెలవదు అనుకుంటున్నావా? టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి అంటూ ఈటల రాజేందర్ మంత్రిని సవాల్ చేశారు.
నీ కథ ఎందో అంతా తెలుసు. నువు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది. అదే గతి నీకు పడుతుంది అంటూ రాజేందర్ అన్నారు. 2006 లో కరీంనగర్ లో ఎంపీ గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, YS రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్ లో కూడా అదే జరుగుతుంది. ప్రజలు అమాయకులు కారు అంటూ ఈటల రాజేందర్ ఎన్నికల శంఖారావం పూరించారు.
సంస్కారం తోనే మర్యాద పాటిస్తున్నానని ఆయన అన్నారు. సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారంటూ ఆయన హెచ్చరించారు. హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరు కొనలేరు. ఈ ప్రజల మీద ఈగ వాలకుండా చూస్తా అని రాజేందర్ చెప్పారు.