కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య అరకోటి దాటింది. ఈ క్రమంలో యూరప్లో కరోనా పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. వచ్చే ఫిబ్రవరి నాటికి యూరప్లో కోవిడ్-19 బారిన పడి మరో ఐదు లక్షల మంది మరణించే అవకాశముందని డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
ప్రస్తుతం యూరప్ రీజియన్ పరిధిలోని 53 దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోందని.. దీనివల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లుగే పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే, యూరప్ దేశాల్లో మరో ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యానించారు.
రష్యా, జర్మనీ, బ్రిటన్ పలు దేశాల్లో కోవిడ్-19 మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతోపాటు కేసులు కూడా వేల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. పలు వేరియంట్ల మూలంగా కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.