37.2 C
Hyderabad
March 28, 2024 19: 49 PM
Slider సంపాదకీయం

మరీ ఇంత సైలెంటుగా ఉందేమిటి?

Jammu-and-Kashmir

దేశంలో ముస్లింలు తిరుగుబాటు చేస్తారని, పాకిస్తాన్ ఏకంగా మీదికి వచ్చేసి బాంబులు వేస్తుందని ఇంత కాలం మనం భయపడుతూ కొనసాగించిన రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని అకస్మాత్తుగా, అర్ధంతరంగా ఎత్తేసినా ఒక్కరూ కిక్కురుమనలేదేమిటి? ఆసేతు హిమాచలం నిశ్శబ్దంగా ఉందేమిటి? కనీసం కాశ్మీర్ లో కూడా ఒక్కరూ నిరసన ప్రదర్శనలు చేయలేదేమిటి? సైన్యం ఉంది, నిషేధం ఉంది అందుకే ఎవరూ మాట్లాడటం లేదనే సమాధానం చెప్పవద్దు. సైన్యం, అక్కడ నిషేధం చాలా కాలం నుంచి అలానే ఉన్నాయి. దేశంలో ఎక్కడా కూడా గొడవలు తలెత్తలేదు సరికదా ఆర్టికల్ 370 రద్దు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి నుంచి తిరుగుబాటు చేసి బయటకు వచ్చిన సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా ఒక ఇంగ్లీష్ ఛానెల్ తో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు చేసిన కారణంగా దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే గతంలో రాజీవ్ గాంధీకి వచ్చిన దాని కన్నా మోడీకి ఎక్కువ సీట్లు వస్తాయని వ్యాఖ్యానించాడు. మోడీ అంటే గిట్టని యశ్వంత్ సిన్హానే ఇంతటి మాట అన్నాడంటే ఇక దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎంతో కాలంగా అంటే ఆవిర్భావ కాలం నుంచి కూడా బిజెపి అంతకు ముందు జనసంఘ్ ఆర్టికల్ 370 రద్దు చేయాలని కోరుతూ ఉన్నాయి. బిజెపి ఆవిర్భావ లక్ష్యం కూడా మూడే మూడు ప్రాధమిక సూత్రాల సాధన. అవి ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరసత్వం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం. ఈ మూడింటిలో అత్యంత కష్టమైనది ఆర్టికల్ 370 రద్దు అని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్ కూడా ఇంత కాలం ఇదే ప్రచారం చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం అత్యంత కష్ట సాధ్యమని, దాన్ని చేయడం సాధ్యం కానే కాదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆర్టికల్ 370 జోలికి వెళితే భారత సార్వభౌమాధికారం చిక్కుల్లో పడుతుందని కూడా ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆర్టికల్ 370ని దేశంలోని యావత్తు ముస్లింల మనోభావనలకు అద్దం గా కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించింది. కేవలం రాష్ట్రపతి ఒక్క ఉత్తర్వు ఇస్తే చాలు అని చెప్పిన ఏకైక వ్యక్తి డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి. ఆయన ఆ మాట చెప్పినప్పుడల్లా ఆయనను ఒక పిచ్చివాడిగా చూశారు అందరూ. ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్టని తేలింది. ఆర్టికల్ 370తో ఆగకుండా కాశ్మీర్ రాష్ట్రాన్ని లేకుండా చేయడం బిజెపి కొత్త స్ట్రాటజీ కావచ్చు. జమ్మూ కాశ్మీర్ లో బిజెపి కాలు మోపినప్పుడే ఇలాంటివేవో జరుగుతాయని కాంగ్రెస్ గానీ అక్కడి పార్టీలు గానీ ఊహించి ఉండాల్సింది. అయితే బిజెపిని తక్కువగా అంచనా వేసిన కాశ్మీర్ పార్టీలు బిజెపితోనే పొత్తు పెట్టుకున్నాయి. తమ చెప్పు చేతల్లో బిజెపి ఉంటుందని తలపోశాయి. కాశ్మీర్ లో బిజెపికి అధికారం పంచిపెడితే తమ అదుపులో ఉంటుందని తలపోసిన వారు ఇప్పుడు ఎక్కడ తలదాచుకుంటున్నారో కూడా అర్ధం కావడం లేదు. మెజారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు గెలిచి నట్లు అనిపిస్తుంది అయితే ఇది తప్పు అని భవిష్యత్తులో తప్పు అని తేలుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావచ్చు. భవిష్యత్తులో ఇది తప్పు కావచ్చు. ఎలాగైతే అప్పటిలో జవహర్ లాల్ నెహ్రూ ఆర్టికల్ 370 పెట్టడం తప్పు అని ఇప్పుడు అనుకుంటున్నామో ఇది కూడా మరో 70 ఏళ్ల తర్వాత తప్పని తేలవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం ఇదే మాట పదే పదే మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల నుంచి మరింత దూరం అయిపోతుంది. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్వప్నం నెరవేరిందని బిజెపి చెబుతున్నది. అప్పట్లో కాశ్మీర్ లో ఇతర రాష్ట్రాల వ్యక్తులు ప్రవేశించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. దీన్నీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన దీన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష కూడా చేశారు. అప్పటి ప్రధాని నెహ్రూకు ఎన్నో లేఖలు కూడా రాసారు. ఒకసారి పార్లమెంటులో మాట్లాడుతూ ” ఏక్ దేశ్ మే దో నిషాన్, దో సంవిధాన్, దో ప్రధాన్ నహీ చెలేంగే నహీ చెలేంగే ” ( ఒకే దేశంలో రెండు చిహ్నాలు, రెండు రాజ్యరంగాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదు) అంటూ కాశ్మీర్ ను ఉద్దేశిస్తూ అన్నారు. కాశ్మీరులో గుర్తింపు కార్డు నియమాన్ని రద్దు చేశారంటే అది శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోరాటం వల్లనే. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని 2019 ఎన్నికల్లో బిజెపి తమ మానిఫెస్టోలో కూడా చేర్చింది. ఇప్పుడు సమయం వచ్చింది…కొట్టేశారు…అంతే.

Related posts

బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షుడితో రహ్మతుల్లా భేటీ

Satyam NEWS

కమలానికి చెమట పట్టకుండా తిరుగుతున్న ఫ్యాను

Satyam NEWS

వ్యాక్సిన్ అపోహలపై పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్

Satyam NEWS

Leave a Comment