ప్రతి ఒక్కరూ సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలను పాటిస్తూ అధ్యాత్మికచింతనతో సన్మార్గంలో ముందుకు సాగాలని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో అధికారికంగా నిర్వహించిన బంజారాల అరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలకు ఆయన ఛీప్ గెస్ట్గా హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావు , ఐటీడీఏ పీఓ భవేష్ మిశ్రా, ఉత్సవ కమిటీ మెంబర్లు, బంజార కుల పెద్దలతో కలిసి జగదంబమాతా, సేవాలాల్ మహారాజ్కు బంజారాల సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బంజారల జీవనం ప్రకృతీ ఆరాధనతో ముడిపడి ఉంటుందన్నారు.
గోవులను ప్రేమిస్తూ అహింసకు దూరంగా బంజారాలు జీవిస్తారన్నారు. అలాంటి ప్రతి బంజార కుటుంబానికి రెండు చొప్పున ఆవులను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో బంజారా భవన్, సేవాలాల్ మందిర్ నిర్మాణాలకు ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ సత్యాన్నే మాట్లాడాలని, అహింస మార్గంలో నడువాలని , జీవహింస చేయరాదనే సేవాలాల్ మహారాజ్ బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. బంజారాల సంస్క్రతి, సంప్రదాయాలు వైవిధ్యంగా ఆకట్టుకునేలా ఉంటాయన్నారు.
కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నందున ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులను ధరిస్తు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావులు మాట్లాడుతూ ఉద్యమనేతగా బంజారాల స్థితిగతులను ప్రత్యక్షంగా చూసిన కేసీఆర్ సీఎం అయ్యాక కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తు అన్నికులాల ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారన్నారు.
ఆడబిడ్డల తాగునీటి కష్టాలను తొలగించేలా ప్రతి తండాకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్లతో శుద్దజలాన్ని అందిస్తున్నామన్నారు. గిరి వికాసం కింద అర్హులైన వారికి ఎడ్లబండ్లు, కరెంట్ మాటార్లను అందించడంతో పాటు , చేన్లను పంటల సాగుకు యోగ్యంగా మార్చుకునేందుకు ఐటీడీఏ ద్వారా ఆర్థికసాయమందిస్తామన్నారు.
పాడి పరిశ్రమ అభివృద్ది కోసం వికారాబాద్, మహాబుబాబాద్ జిల్లాల్లో ఆవులను అందించేలా ఫైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని త్వరలోనే ఆదిలాబాద్ జిల్లాకు సైతం అమలు చేస్తామన్నారు. అంతకు ముందు బంజారాలు తమ సంప్రదాయబద్దంగా నిర్వహించిన నృత్యాలు, మహిళల వేషాధారణ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్, చారులత రాథోడ్, అనిల్ జాదవ్, అజ్మీరా శ్యాంనాయక్, భరత్ చౌహాన్, అమర్సింగ్ తిలావత్ తదితరులు పాల్గొన్నారు.