కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో శనివారం గాంధీభవన్ లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల నేతృత్వంలో జరిగిన సమావేశంలో భారత్ జోడోయాత్ర తెలంగాణ రాష్ట్ర మహిళా మోబిలైజేషన్, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు, డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం తెలంగాణలోకి ప్రవేశిస్తుందని అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే యాత్ర తెలంగాణలో 375 కిలోమీటర్లు కొనసాగుతుందన్నారు. దేశంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో, రాష్ట్రంలో టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిమానులు భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివారం నుంచి తెలంగాణలో జరగనున్న భారత్ జోడో యాత్రలో భాగస్వామ్యం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ సిద్ధమవ్వాలన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి