కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య వార్ కొనసాగుతున్న తరుణంలో నేడు ఇద్దరు ఒకే వేదికపై కలవడం ఆశ్చర్యానికి గురి చేసింది.
గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీ సద్గురు రామారావు మహరాజ్ సంస్మరణ సభ ఇందుకు వేదికైంది. 2004 నుంచి ఓటమి లేని నాయకునిగా తిరుగులేని విజయాన్ని సాధించిన ఎమ్మెల్యే ఒకరైతే మరొకరు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరి టికెట్ సంపాదించి ప్రజల చందాలతో ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు.
వాళ్ళే జాజాల సురేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి. వీరిద్దరి మధ్య గత కొద్ది కాలంగా నియోజకవర్గంలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయారు.
ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఎప్పుడు కూడా ఇద్దరు ఒకే చోట కలిసిన సందర్భాలు కూడా లేవు. అలాంటి వారిని ఆధ్యాత్మిక గురువు రామారావు మహరాజ్ సంస్మరణ సభ ఒకే వేదికను పంచుకునేలా చేసింది.
నేడు జరిగిన సభలో రాజకీయ అంశాలు ఒక్కటి కూడా లేకపోయినా వీరిరువురు ఒకే వేదికపై కలవడం కార్యకర్తలను, ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.