ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. బీపీ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే స్టార్ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. వివాద రహితుడైన రోశయ్య మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం మిగిల్చింది. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
తమిళనాడు గవర్నర్ గా కూడా ఆయన పని చేశారు. కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యుడా రోశయ్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పని చేసారు.
2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు.