సీఎం కేసీఆర్ చెప్పేవన్ని అబద్ధాలేనని, తాను వేసిన పంట నష్టం జరిగిన విషయంలో అబద్ధం చెప్తే తనను ఉరి తీయాలని, లేకపోతే సీఎం రాజీనామా చేయాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు గోస ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్డుపై రైతులతో బైఠాయించి నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
అనంతరం మీడియాతో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సన్నరకం వేయకపోతే ధాన్యం కొనుగోలు చేయము, రైతు బంధు ఇవ్వమని సీఎం చెప్పారన్నారు. సీఎం మాటకు భయపడిన రైతులు దొడ్డురకం కాదని సన్నరకం వరి వేశారని తెలిపారు. సన్నరకం వేసి 90 శాతం పంట రైతులు నష్టపోయారని, నష్టపోయిన వరికి ఎకరానికి 30 వేల పరిహారం అందించాలన్నారు.
సన్నరకం వరికి 2500 మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, గతంలో ఉన్న చోటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.
పత్తి పంట నష్టపోయిన రైతుకు 80 వేల పరిహారం ఇవ్వాలన్నారు. తాను వేసిన పంటపై సీఎం అబద్ధం చెప్తే పంటను పరిశీలించాలని సవాల్ విసిరితే వారం అవుతున్నా స్పందించలేదని విమర్శించారు. నేను తప్పు చేస్తే నన్ను ఉరి తీయాలని, లేకపోతే నువ్వు రాజీనామా చేయు కేసీఆర్ అని మరోసారి సవాల్ విసిరారు.