ఖమ్మం జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల ఏర్పాటుకు భవనాలు, సదుపాయాలకల్పనకు క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా. రమేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రస్తుత కలెక్టరేట్ విసి హాల్, ప్రజ్ఞ సమావేశ మందిరం, రికార్డు రూమ్, సివిల్ సప్లయి భవనం, ఇవిఎం గోడౌన్, రోడ్లు భవనాల శాఖ కార్యాలయాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు మంజూరయిన వైద్య కళాశాల ప్రస్తుత కలెక్టరేట్, ఆర్ అండ్ బి కార్యాలయాల స్థానంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సివిల్ పనులకు రూ. 68 కోట్లు, రూ. 98 కోట్లు భవనాలు సదుపాయాలకల్పనకు మొత్తంగా రూ. 166 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. హాస్టల్ కొరకు బాలుర, బాలికలకు విడివిడిగా భవనాలు గుర్తించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతుల ప్రారంభానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా వైద్య విద్య సంచాలకులు డా. రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ఉన్న భవనాలకు అవసరమైన మార్పులు చేసుకొని ఉపయోగంలోకి తేవాలని అన్నారు. ఖాళీ ప్రదేశాలలో భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. కాలేజి కౌన్సిల్ హాల్, ప్రిన్సిపాల్ చాంబర్, ఆకాడమిక్ సెక్షన్, హిస్తాలజి ల్యాబ్, లెక్చర్ హాల్ తదితరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రమాణాల మేరకు తరగతి గదులు, ల్యాబ్ తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, వైద్య విద్య సంయుక్త సంచాలకులు డా. చంద్రశేఖర్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. వెంకటేశ్వర్లు, ఆర్ఎంఓ డా. శ్రీనివాస్, టీఎస్ ఎంఎస్ఐడిసి ఇఇ ఉమామహేశ్వరరావు, ఆర్ అండ్ బి డిఇ విశ్వనాథ్, అధికారులు, తదితరులు ఉన్నారు.