కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. కర్ణాటకలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 113 సీట్లు గెలవాలి. ఆ మ్యాజిక్ మార్క్ ను కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పీపుల్స్పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 42 శాతం, బిజెపికి 36 శాతం, జేడీ(ఎస్)కు 16 శాతం అవకాశం ఉంది (మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ 2 శాతం).
పీపుల్స్పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 107-119, బిజెపికి 78-90, జేడీ(ఎస్)కు 23-29, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. పీపుల్స్పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్-బిజెపి మధ్య ఓట్ల వ్యత్యాసం 6 శాతం ఉండే అవకాశం ఉంది. 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4 శాతం ఓట్లను అధికంగా పొందుతుండగా, బిజెపి 0.35 శాతం, జేడీ(ఎస్) 2.3 శాతం ఓట్లను కోల్పోయే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.
ముఖ్యమంత్రిగా ఎవరుండాలని అడిగితే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని 42 శాతం మంది, ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై అని 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అని 17 శాతం, మాజీ సీఎం బి.యడియూరప్ప అని 14 శాతం మంది, డి.కె.శివకుమార్ అని 3 శాతం మంది కోరుకుంటున్నారు. కర్ణాటకలోని మొత్తం 6 రీజియన్లలలో ఐదింటిలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా కోస్తా కర్ణాటకలో మాత్రం బిజెపి ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆకర్షనీయమైన మేనిఫెస్టో వల్ల ఆ పార్టీకి లాభం చేకూరిందని పీపుల్స్పల్స్ పేర్కొన్నది.
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొంతవరకు ప్రభావం చూపగలిగిందని కూడా పీపుల్స్పల్స్ పేర్కొన్నది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య తదితర అంశాలపై అధికార బిజెపి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత కారణంగానే బిజెపి అధికారం కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి.
ప్రధానంగా గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. కర్ణాటకలో అధికార బిజెపి పార్టీపై ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా పాత పెన్షన్ పథకం అమలుకు ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ లేవనెత్తిన జై బజరంగ్బలి, టిప్పు సుల్తాన్, ఈద్గా మైదాన్ వంటి … వివాదాస్పద అంశాలు ప్రజలపై ప్రభావం చూపలేకపోయాయి.
ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేత వల్ల ముస్లింలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. పీపుల్స్పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేను రాష్ట్రంలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టింది. ప్రతి నియోజకవర్గంలో మూడు పోలింగ్ స్టేషన్లను ఎంపికచేసుకొని, ఒక్కో స్టేషన్లో 15-20 శాంపిల్స్ చొప్పున మొత్తం 3024 శాంపిల్స్ను సేకరించింది.