హుజురాబాద్ ఉప ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ ఓం ప్రకాష్, పోలీస్ అబ్జర్వర్ అనుపం అగర్వాల్ నేడు హనుమకొండ కు వచ్చారు. స్థానిక హరిత హోటల్లో వద్ద బుధవారం నాడు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ తరుణ్ జోషి లు వారికి స్వాగతం పలికారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ ఈ నెల 30 న హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఎన్నికల పోటీలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికలలో చేసే ఖర్చులపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు.
ఓటర్లను ప్రలోభపెట్టేలా పోటీలో ఉన్న అభ్యర్థులు పంపిణీ చేసే డబ్బు, మద్యం, బహుమతుల పై దృష్టి సారిస్తామని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, తనిఖీ పకడ్బందీగా చేస్తున్నారా లేదా అనే విషయాల పై గట్టి నిఘా ఉంటుందని పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు పెట్టే ఖర్చుల వివరాలను ఎక్స్ పెండీచర్ బృందాలు ప్రతి రోజు నమోదు చేయాలని, వీటి పై గట్టి నిఘా పెట్టాలని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నివేదికను ఎన్నికల సంఘానికి నివేదిస్తామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ వాసుచంద్ర, డిసిపి పుష్ప, హనుమకొండ తహసీల్దార్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.