చెత్తకుప్పలో భారీ పేలుడు సంభవించిన భయానక సంఘటన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ లో కొద్ది సేపటి కిందట జరిగింది. చెత్త ఏరుకుంటున్న నాగయ్య అనే వ్యక్తి కి ఈ పేలుడులో తీవ్ర గాయాలు అయ్యాయి. చెత్త కుప్పలో బాంబు ఉంటుందని ఊహించని నాగయ్య ఎప్పటి లాగే చెత్త ఏరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్క సారిగా పేలుడు సంభవించడంతో ముషీరాబాద్ ప్రాంతం ఉలిక్కిపడింది.
ఈ ప్రమాద నుంచి నాగయ్య తృటిలో ప్రాణాలతో బయట పడ్డాడు. సంఘటన గురించి సమాచారం అందుకోవడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గాయాలు అయిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రి కి పోలీసులు తరలించారు. ఉదయం 11:20నిమిషాలకి ఘటన జరిగింది. పేలుడు శబ్దం 300 మీటర్ల వరకు వ్యాపించింది. పోలీసుల దర్యాప్తులో తేలింది ఏమిటంటే అక్కడ చెత్త కుప్పలో ఒక కెమికల్ డబ్బాను ఎవరో ఉంచారు.
ఆ డబ్బా పేలినట్లు పోలీసులు గుర్తించారు. కెమికల్ డబ్బా ఎలా బ్లాస్ట్ అయిందో పరిశీలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.