ఐడిఓసి కార్యాలయంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పక కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఐడిఓసి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక కంటి పరీక్షా క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా కంటి పరీక్షలు నిర్వహించుకొనుటకు గాను ఈ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించుకోవడానికి వీలుగా అన్ని శాఖలకు ఏ రోజు కంటి పరీక్షలు చేపించుకోవాలో షెడ్యూల్ తయారు చేయాలని ఏఓ గన్యాకు సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రోజు వారిగా నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం అధికారులు, వారి సిబ్బంది ఉదయం 9 గంటలకే ఐడిఓసి కార్యాలయంలోని కంటి పరీక్ష కేంద్రంలో కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు.
ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కలిపి 600 మంది వరకు ఉన్నారని, అందరూ కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ కంటి పరీక్షలు నిర్వహణకు రిజిస్ట్రేషన్ చేపించుకుని, ఆన్లైన్, ఏ ఆర్ మిషన్ ద్వారా కళ్ళు పరీక్షించుకున్నారు. రీడింగ్ సమస్య ఉన్న వారికి తక్షణమే కంటి అద్దాలు పంపిణీ చేయాలని, ప్రిస్క్రిప్షన్ సమస్యలున్న వారి వివరాలు కంటి వెలుగు పోర్టల్ లో నమోదు ఆధారంగా రెండు వారాల్లో ప్రత్యేక కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు కంటి సమస్యలు ఏమి లేనట్లు చెప్పారు. పరీక్షలు అనంతరం జిల్లా వైద్యాధికారి డా శిరీష కంటి వెలుగు కార్యక్రమంలో నమోదు చేసిన “ఐ స్క్రీనింగ్ మెడికల్ రికార్డు” ను కలెక్టర్ కు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ శిరీష, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఏ ఓ గన్యా, ప్రోగ్రాం అధికారి డా పర్షియా నాయక్, డాక్టర్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.