విద్యార్థులు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో పదోతరగతి పరీక్షలకు సిద్దం కావాలని ఏపీ రాష్ట్ర డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పదోతరగతి విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు రాయడంపై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం ఎస్వీఎన్ నగర్ ఒక ఫంక్షన్ హాలులో అవగాహనా సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యుటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ, పదోతరగతి విద్యార్థులకు అవగాహనా సదస్సును ఏర్పాటు చేయడం ఒక కొత్త ఒరవడిగా పేర్కొన్నారు. దీనిని ఏర్పాటు చేసిన మున్సిపల్ విద్యాకమిటీని అభినందించారు. రాష్ట్రప్రభుత్వం విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు విద్య ద్వారానే అభివృద్ది సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
విద్యకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, సమస్తమూ ప్రభుత్వమే అందిస్తోందని చెప్పారు. చక్కని విద్యను అందించడంతోపాటు, మంచి పోషక విలువలతో కూడిన రుచికరమైన భోజనాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ద వల్ల, బడిపిల్లలంతా శతశాతం భోజనం చేస్తున్నారని అన్నారు. కంటివెలుగు కార్యక్రమం ద్వారా కళ్ల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
విద్యార్థులు కష్టపడి చదివి, తమపై తల్లితండ్రులు, గురువులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, కాలం విలువను తెలుసుకోవడం విజయానికి మేలైన మార్గమని పేర్కొన్నారు. దీనిని గుర్తించగలిగితే, సగం విజయాన్ని సాధించినట్టేనని అన్నారు. ప్రతీ విద్యార్ధీ ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని కోరారు.
ముఖ్యంగా ఏకాగ్రతను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇతర అంశాలకంటే చదువుకే ఎక్కువ విలువనివ్వాలని అన్నారు. కష్టాలకు, వైఫల్యాలకు కృంగిపోకుండా, ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా, విశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు. ప్రతీఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలని, బాలికలు కూడా చిన్నవయసులోనే పెళ్లి జోలికి పోకుండా కనీసం డిగ్రీవరకు చదువుకొని, ముందుగా తమ కాళ్లమీద తాము నిలబడేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థులు ప్రశాంతతను అలవర్చుకోవాలని సూచించారు. ఆందోళన చెందకుండా పదోతరగతి పరీక్షలను రాయాలని కోరారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా తల్లితండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిప్యుటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకొనే వయసులో కష్టపడితే, జీవితంలో సుఖఃపడతారని అన్నారు. ఈ పదోతరగతి పరీక్షల్లో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి 25వేలు, రెండో విద్యార్ధికి 15వేలు, మూడో విద్యార్థికి 10వేలు నగదు బహుమానాన్నిఇస్తానని ప్రకటించారు.
ఈ సదస్సులో జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి, ఉప విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.తిరుపతినాయుడు, విద్యాకమిటీ సభ్యులు సంతోషికుమారి, బి.పద్మావతి, టి.సంధ్యారాణి, పార్టీ నాయకులు ఆశపు వేణు, ఉపన్యాసకులు రవికె మండా తదితరులు పాల్గన్నారు.