రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు తమ చెమటను, రక్తాన్ని ధారపోస్తున్న మందుబాబులకు పాదాభివందనం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పంథా గాని నరసింహ ప్రసాద్ అన్నారు. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం పంచాయతీలోని మద్యం దుకాణం వద్ద మందు బాబులకు ఆయన సన్మానం చేశారు.
అధిక ధరలకు చీప్ లిక్కర్ తాగుతూ రాష్ట్ర ప్రభుత్వం నడిచేందుకు సహకరిస్తున్న వారికి సన్మానం చేయాల్సిందేనని ఆయన అన్నారు. మందుబాబులకు లుంగీ, టవల్, యాపిల్ పండు ఇచ్చి శాలువ కప్పి ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చీప్లిక్కర్ రూ.50 ఉండగా ప్రస్తుతం రూ.200 విక్రయిస్తున్నారని అన్నారు. తాగుడుకు బానిసలైన మందుబాబులు కూలీనాలీ చేసుకుని వచ్చిన సంపాదనంతా మద్యానికి తగలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నడవడానికి వీరంతా తమ ఆరోగ్యం పాడుచేసుకుంటున్న త్యాగమూర్తులు వీరని ఆయన అన్నారు. మద్య నిషేధం చేస్తామని గొప్పలు చెప్పుకుని నేడు ఆదాయం కోసం పిచ్చి పిచ్చి బ్రాండ్ మద్యం విక్రయాలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు.
ఒక్క చాన్సు ఇవ్వండి అంటూ అధికారం చేపట్టారని.. ప్రస్తుతం ప్రజలకు ఒక్క చాన్సు ఇస్తే వైసీపీని తుదముట్టిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు బొక్కసం సునీల్, జూనియర్ ఎన్టీఆర్ యూనియన్ అధ్యక్షుడు కస్తూరి దినేష్, నాయకులు ముద్దపోలు సభాపతి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.