అన్ని పోలీస్ స్టేషన్ లో మహిళా సిబ్బంది కోసం సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు తెలిపారు. మహిళా సిబ్బంది కోసం అన్ని పోలీస్ స్టేషన్ లో మరుగుదొడ్లు రెస్టు రూంలు, డ్రెస్ చేంజ్ రూంలు ఏర్పాటు చేస్తామన్నారు. నేడు నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లో మహిళ సిబ్బందితో సమావేశమయ్యారు.
ఇందుకోసం డబ్ల్యుఎస్ఐ అంజమ్మ ను జిల్లా మహిళా నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక నుండి మహిళా సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉన్నా నోడల్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి నోడల్ అధికారి ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇప్పటి వరకు ఉన్న మరుగుదొడ్లు, డ్రెస్ చేంజ్, విశ్రాంతి రూములకు స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
మహిళా సిబ్బంది అందరి భాగస్వామ్యంతో వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి సమస్యలను అందులో పొందుపరచాలని సూచించారు. మిగతా పోలీస్ స్టేషన్లో వీలైనంత త్వరలో ఏర్పాటు చేసి మహిళా సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, ఎఓ వెంకట శేఖర్, DCRB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నోడల్ అధికారి, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.