మన ఊరు మనబడి పనులలో నిర్లక్ష్యం వహించి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు. ఐడిఓసి సమావేశపు హాలులో పాల్వంచ మండలంలోని మన ఊరు మనబడి కింద ఎంపిక చేసిన 24 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మొత్తం మీద ఒక్క పాఠశాల కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని మండలంగా పాల్వంచ ఉందని ఇటువంటి పరిస్థితి జిల్లాకు అవమానకరమని అన్నారు. పాఠశాలల్లో జరిగే పనులలో కాంట్రాక్టర్ల అలసత్వం, ప్రధానోపాధ్యాయుల బాధ్యతారాహిత్యం కనబడుతున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టవలసినదిగా సంబంధిత ఈఈ కి సూచించారు.
అంతేగాక ప్రధానోపాధ్యాయులందరికీ షోకాస్ నోటీసులు ఇవ్వవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఇప్పటి వరకు పాల్వంచ మండలంలో జరిగిన పనులలో 1.5 కోట్లకు అంచనాలు రాగా ఒకటే పాయింట్ రెండు కోట్లు విడుదల చేసినట్లుగా తెలిపారు.
నిధులకు ఇబ్బంది లేదని, పనులను ఎట్టి పరిస్థితులలోనూ జూన్ మొదటి వారానికల్లా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని లేనిచో సంబంధిత అధికారులు అందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.