ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు చేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ విద్యా సంస్కరణల పేరుతో ప్రాధమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే దిశగా నిర్ణయాలను తీసుకుంటున్నదని ఫ్యాప్టో ఆరోపించింది. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ప్యాప్టో ఆధ్వర్యంలో శని వారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి.
ఈ ధర్నాలో ప్యాప్టో నాయకులు పి బి వి ఎన్ ఎల్ నారాయణ మాట్లాడుతూ 3.4.5.తరగతులను ప్రాధమిక పాఠశాలలలోనే కొనసాగించాలని, పూర్వ ప్రాధమిక పాఠశాలలను ప్రాధమిక పాఠశాలలలో కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో టి డి పి ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను నిర్వీర్యం చేసిందని, ప్రస్తుత అధికార వై సి పి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న 1లక్షా86000 మంది ఉపాధ్యాయులను 1లక్షకు కుదించాలని, 50 వేల పాఠశాలలను 15000 కు తగ్గించాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
డి ఎస్ సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్ లు ఇవ్వక .శిక్షణ పొందిన నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పించని పరిస్థితి ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బి ఏ సాల్మన్ రాజు, బి గోపి మూర్తి మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 1 కిలోమీటర్ దూరం లో ఒక స్కూలు ఉండాలి అన్నారు.
ఇప్పటికే జిల్లాలో ఖాళీగా ఉన్న 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని తెలిపారు. 40 ఉపాధ్యాయ సంఘాలుండగా ప్రభుత్వం ప్రవేశపెట్టే జాతీయ విద్యా విధానం అనే సంస్కరణలను 38 సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు టి మోహన్ జి వెంకటేశ్వరరావు సి హెచ్ శివరాం ఎన్ శ్రీనివాసరావు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.