సంతృప్తితో జిల్లా నుండి వెళుతున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ బదిలీ సందర్భంగా వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పాత్రికేయులు, కలెక్టరేట్ సిబ్బంది, ఎన్జీవో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరుగా సేవలు అందించిన ఇంతియాజ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో 2 సంవత్సరాల 4 నెలలు ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు.
ఎన్నో యేళ్ల తరువాత కృష్ణానదికి సంభవించిన వరదల నివారణ చర్యలు తీసుకోవడంలో అందరూ సహకరించారన్నారు. రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
కోవిడ్ మొదటి వేవ్ కంటైన్మెంట్ పటిష్ట నిర్వహణ, సెకండ్ వేవ్ ఆసుపత్రులలో కోవిడ్ రోగులకు చికిత్స అందించడం చేయడం ద్వారా కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గించగలిగామని, ఇప్పటి దాకా జిల్లాలో కోవిడ్ పాజిటివ్ లక్ష దాటలేదని చెప్పారు.
జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహం వద్ద మొక్క నాటారు. డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఆర్ డివో ఎన్ఎస్ కె.ఖాజావలి, ఎవో వెన్నెల శ్రీనివాస్, తహసీల్దార్ డి.సునీల్ బాబు, రెవిన్యూ సర్వీసు అసోసియేషన్ ప్రతినిధులు శ్యామ్, ఎన్జీవో నాయకులు పలువురు పాత్రికేయులు జిల్లా కలెక్టరు గత రెండేళ్లుగా జిల్లాలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కలెక్టర్ సేవలను కొనియాడారు.