రైతులు వ్యాపారులు కారు. భూమి విలువ ఎంత పెరిగినా రైతు వ్యవసాయమే చేస్తాడు తప్ప అమ్ముకొని పోవడం లేదు. రైతు త్యాగమూర్తి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ క్లస్టర్ రైతు వేదికను నేడు ఆయన రైతులకు అంకితం చేశారు.
135 కోట్ల భారత దేశంలో వ్యవసాయం ను ప్రోత్సహించకపోతే మిగిలేది ఆకలి చావులు, శవాల గుట్టలు మాత్రమేనని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ, విదర్భలో జరిగిన రైతు ఆత్మహత్యల గురించి జయతీ ఘోష్, రామచంద్ర కమీషన్లు రిపోర్ట్స్ ఇచ్చాయని, ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేదా అని ఒక భారతీయ పౌరుడిగా నేను అడుగుతున్న అని మంత్రి అన్నారు.
ఎందుకు రైతు రోడ్డుకి ఎక్కాలి? ఎందుకు రైతు సమ్మెలు చేయాలి? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో 1.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని FCI కొనుగోలు చేస్తే ఒక్క తెలంగాణ నుండే 62 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని FCI చైర్మన్ ప్రకటించారని, ఇది మన గొప్పతనం అని మంత్రి అన్నారు.
34 వేల ఎకరాల నుండి 94 వేల ఎకరాలకు హుజూరాబాద్ లో వరి సాగు పెరిగిందని మంత్రి ఈటల తెలిపారు. గండిపల్లి, గౌరవెల్లి ప్రాజెక్ట్స్ పూర్తి చేసి మిగతా గ్రామాలకు కూడా నీళ్లు అందిస్తాము. వచ్చే సంవత్సరం లో ఈ ప్రాజెక్ట్స్ కాలువల్లో నీళ్లు పారిస్తాము. హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వదిస్తే ఆంధ్ర పాలకుల మీద కొట్లాడే అవకాశం వచ్చింది. కరెంటు గురించి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మ్యాప్ లు పెట్టీ ఏదో చెప్పిండు. కానీ తెలంగాణ వచ్చాక మన సీఎం కెసిఆర్ కరెంటు కష్టాలు లేకుండా చేశారు. 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో అయిన 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నారా ? అలా నిరూపిస్తే సన్యాసం పుచ్చుకుంటా అని మంత్రి ఈటల సవాల్ చేశారు.