తన భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేశాడని ఆరోపిస్తూ గర్గుల్ గ్రామానికి చెందిన బాలరాజు గౌడ్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని గెలాక్సీ ఫంక్షన్ హాలుకు ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గర్గుల్ గ్రామంలో సర్వే నంబర్ 310/4 లో ఎకరం భూమి ఉందన్నారు. ఆ భూమిని గ్రామ సర్పంచ్ రవితేజ గౌడ్ కబ్జా చేశాడని తెలిపారు. ఆ భూమిలో తన అనుమతి లేకుండానే ఆక్సిజన్ పార్కు ఏర్పాటు చేసి మొక్కలు నాటారని ఆరోపించారు. భూమి గురించి అడిగితే ఆ భూమి తనది కాదని, ఫేక్ పాస్ బుక్ ఉందని సర్పంచ్ తెలిపాడన్నారు.
ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తే సర్వేయర్ వచ్చాడని, సర్వే చేయకుండా సర్పంచ్ అడ్డుకున్నారని ఆరోపించారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అప్పటి ఎస్సై శ్రీకాంత్ తనను బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అండ చూసుకుని సర్పంచ్ కబ్జాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. తన భూమి సర్వే చేయాలని, అప్పటిదాకా తాను కిందకు దిగేది లేదని అక్కడే బిష్మించుకుని కూర్చున్నాడు. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటనని తెలిపాడు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.
రెండు గంటలుగా గ్రామస్తులు, పోలీసులు, కుటుంబ సభ్యులు సముదాయించినా వినిపించుకోకుండా అక్కడే కూర్చున్నాడు. సుమారు మూడున్నర గంటల అనంతరం ఫిర్యాదు చేస్తే సర్పంచ్ ను పిలిపించి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితుడు కిందకు దిగాడు. దాంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.