ఎన్ సి ఆర్ బి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నివేదిక ప్రకారం 2019 లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 10,281 మంది రైతులు , రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తం మృతులలో మహారాష్ట్ర 3927 ( 38%) మందితో అగ్రస్థానంలో ఉండగా కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , మధ్యప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు వరుసగా తరువాతి స్థానాలలో ఉన్నట్లు నివేదిక తెలిపింది.
ఆత్మహత్యలతో జీవితం చాలించిన వారిలో 68 శాతం మంది చిన్న , సన్నకారు రైతులు, రైతుకూలీలు ఈ 5 రాష్ట్రాలకు చెందిన వారే కావడం ఆందోళన కలిగించే విషయం.
ఏ ఏటకాఏడు పెరుగుతూనే ఉన్న మరణాలు
గడచిన 16 ఏళ్ళ గణాంకాలు పరిశీలిస్తే దేశం మొత్తం మీద 2.63 లక్షల అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న పలు మరణాలను గమనిస్తే 2017 లో 7.7 % , 2018 లో 8.7 % రైతు ఆత్మహత్యలు చోటుచేసుకున్నట్లు నివేదికలు ఉన్నాయి.
రైతుల బలవన్మరణాలపై చేపట్టిన పరిశోధనలు , అధ్యయనాలు అనేక వాస్తవాలు వెల్లడిచేశాయి.
సాగుభూమి తరచూ నిస్సారంకావడం, సాగునీటి అలభ్యత, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకపోవడం, పండించిన పంటకు కనీసధర లభించకపోవడం, అస్తవ్యస్తంగా ఉన్న మండీ వ్యవస్థ , ప్రయివేటు ఋణా లపై చెల్లించాల్సిన అధికవడ్డీలు, పంటను నిల్వచేసుకునే వసతి తగినంతగా లేకపోవడం …వీటికి తోడు హఠాత్తుగా సంభవించే ప్రకృతివైపరీత్యాలు అన్నదాత నడ్డి విరుస్తున్నాయి.
మొదటి , రెండు , మూడు పంచప్రణాళికలలో వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత లభించింది. తరువాతి కాలంలో సాగురంగానికి కేటాయింపులు క్రమంగా తగ్గిపోయాయి.
రైతు దేశానికి వెన్నెముక అనేది కేవలం నినాదంగానే మిగిలింది. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ తో సహా ప్రస్తుత ఎన్ డీ ఏ ప్రభుత్వం వరకు కర్షకులకు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి.
దేశప్రజలకు తిండిగింజలు అందించే రైతు ఆకలిబాధలు తాళలేక మరణాన్ని ఆశ్రయించడానికి ప్రధానకారణం ఏలికలదే. చట్టాలు గుత్తేదారులకు, పెట్టుబడివర్గాలవారికి ఆదయవనరుగా మారడం బాధాకరం.
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సాగుచట్టాలు రైతును మరింత దుర్భరస్థితికి దిగజార్చడం ఖాయమని సాగురంగ నిపుణులు , ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పొలమరశెట్టి కృష్ణారావు