ఖరీఫ్ సాగు లో రైతు కు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు యంత్రాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులోకి తేవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం కడప జిల్లా కేంద్రంలో ని మార్కెట్ యార్డ్ లోని రైతు భరోసా హబ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో రెండు మూడు కంపెనీల పత్తి విత్తనాలు, బి పి టి వరి విత్తనాలు తప్ప మరే ఇతర విత్తనాలు అందుబాటులో లేవు అన్నారు.
ఎరువులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. సాగుకు అవసరమైన యంత్ర సామాగ్రి చూసేందుకు కూడా లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో10,641, జిల్లాలో 630 రైతు భరోసా కేంద్రాలను గత నెల 31 న ప్రారంభించిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట సంజీవని లాగా పనిచేస్తాయని ప్రకటించారన్నారు.
సౌకర్యాలు లేని రైతు భరోసా కేంద్రాలు
రైతులు సాగుకు అవసరమైన, నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు యంత్రాలు అందుబాటులోకి తేవడమే కాకుండా సాగులో ఆధునిక మెలకువలు, అధిక దిగుబడి సాధించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా మార్కెట్లో మంచి రేటు లభించే విధంగా చర్యలు చేపడతామని ప్రకటించారన్నారు.
ప్రతి రైతు భరోసా కేంద్రం లో కియోస్క్ యంత్రం ద్వారా రైతులు ఎప్పటికప్పుడు వారికవసరమైన వాటిని ఆర్డరు ఇచ్చి తేప్పించుకునే అవకాశం ఉందని చెప్పినప్పటికీ ఆచరణలో రైతు భరోసా కేంద్రాలు భిన్నంగా దర్శనమిస్తున్నాయి అన్నారు.
సౌకర్యాలు కల్పిస్తే వెరైటీ పంటలు
ప్రస్తుతం కడప జిల్లాలో కేసీ కెనాల్ కు నీళ్ళు వస్తే వరి రకాలైన ఎన్ డి ఎల్ ఆర్, జగిత్యాల, నెల్లూరు సన్నాలు, జిలకర మసూర సాగు చేస్తారన్నారు కానీ ఇవేవీ అందుబాటులో లేవు అన్నారు. వర్షాధార పంటలైన పొద్దుతిరుగుడు, శనగ, వేరుశనగ విత్తనాలు అందుబాటులోకి తేవాలి అన్నారు.
ఉద్యాన పంటలైన అరటి, చినీ, నిమ్మ, మామిడి, బొప్పాయి, మిరప, టమోటా, వంగ, ఉల్లి, పసుపు, పూలు విత్తనాలు, మొక్కలు అందుబాటులోకి తేవాలన్నారు. యంత్రాలు 50 శాతం రాయితీ తో పాటు బాడుగకు రైతులకు ఇచ్చేందుకు అందుబాటులోకి తేవాలని వారు అన్నారు. కడప, పులివెందుల లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం కడప రూరల్ ప్రధాన కార్యదర్శి పి.చంద్రశేఖర్ రెడ్డి, రైతు భరోసా హబ్ ఇంచార్జి సుబ్బ నరసయ్య పాల్గొన్నారు.