కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా రైతు శ్రేయస్సు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని రిమ్మన గూడ గ్రామంలో మంగళవారం ఉదయం శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరించారు.
రైతు సంక్షేమం కోసం ప్రతి నిమిషం ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తెలిపారు. క్వింటాలు రూ. 4875/- రూపాయల మద్దతు ధరతో శనగల కొనుగోళ్లు చేస్తున్నామని, దళారులు లేకుండా రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 7770 వరి కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. త్వరలోనే మొక్కజొన్న, వరి, పొద్దు తిరుగుడు కొనుగోళ్ల కేంద్రాలను ప్రతి మండలాల్లో ప్రారంభిస్తాం. ఇందు కోసం రూ. 30 వేల కోట్ల రూపాయల డబ్బు కొనుగోళ్ల కోసం ప్రభుత్వం కేటాయింపు చేసింది అని ఆయన వెల్లడించారు. రైతులు కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్ కు వెళ్లేందుకు పోలీసులు ప్రత్యేక పాసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చామని హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు తో బాటు ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఏంపీపీ, జెడ్పిటీసీ, పీఏసీఏస్ చైర్మన్, రైతు బంధు నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.