కామారెడ్డి జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. సరైన మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన సన్నరకం వరి వేసినా పంటకు పట్టిన దోమకాటు రైతులను నిండా ముంచుతోంది.
దాంతో ఇద్దరు రైతులు తమ మూడెకరాల పంటకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు సన్నరకం వరికి మద్దతు ధర ప్రకటించాలని రైతులు రోడ్డెక్కి 24 గంటలు గడవకముందే ఇద్దరు రైతులు తమ పంట పొలానికి నిప్పు పెట్టిన ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన కొమిరెటి నారాయణ, కొమిరెటి ఆంజనేయులు అనే రైతులు తమ పంట పొలాలకు నిప్పు పెట్టారు. ఈ సందర్బంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం సన్నరకాలు పండించాలని సూచించినా ప్రకృతి తమపై పగబట్టిందన్నారు.
ఇతర పంట వేస్తే కొనమని సీఎం కేసీఆర్ చెప్పారని, అమ్ముకునేదే కదా అని సన్నరకం పంట వేసామని రైతు తెలిపారు. కానీ దోమకాటు రావడంతో పంట మొత్తం నాశనమైందన్నారు. పంట వేయడానికి దున్నడానికి 60 వేల వరకు కర్చయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు