ఉపాధిహామీ కన్వెర్జెన్స్, గడపగడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాల కింద మంజూరైన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల చెల్లింపును వేగవంతం చేస్తోందని అందువల్ల ఈ కార్యక్రమాల కింద చేపట్టిన పనులను రికార్డు చేయడం, బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తదితర ప్రక్రియ తక్షణం పూర్తిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వచ్చే నాలుగు నెలల కాలంలో ఈ కార్యక్రమాల కింద చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో సమస్యలు వుండబోవని, అందువల్ల జిల్లాలో చేపట్టిన పనులన్నీ పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ … విజయనగరం జిల్లా కలెక్టర్
కార్యాలయంలో ఇంజనీరింగ్ పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపాధిహామీ కన్వర్జెన్స్ నిధులతో చేపట్టిన పనులను ఇకపై ప్రతివారం రికార్డుచేసి, నాటికి ఆన్లైన్లో బిల్లులు అప్లోడ్ చేయాలన్నారు. ఈ పనులను నమోదు చేయడం, బిల్లులను అప్లోడ్ చేయడం వంటి అంశాల్లో ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు. జిల్లాలో ఫస్ట్ సిగ్నెటరీ కింద అప్లోడ్ చేసిన 38 కోట్లు, రెండో సిగ్నటరీ కింద అప్లోడ్ చేసిన బిల్లులు మరో 12 కోట్లు పెండింగ్లో వున్నాయని వాటిని త్వరగా చెల్లించేలా
చర్యలు చేపట్టాలని మంత్రి పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడి సూచించారు. ఈ పనులకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి గాని, జిల్లా కలెక్టర్ దృష్టికి గాని ఇంజనీరింగ్ అధికారులు తీసుకువస్తే పరిష్కరిస్తామని మంత్రి స్పష్టంచేశారు.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లాలో మంజూరైన పనులన్నీ వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. మునిసిపల్ ప్రాంతాలు, విద్యుత్ ప్రాంత పంపిణీ సంస్థకు సంబంధించిన పనులకు నిధులు మంజూరు కాలేదని సీపీఓ బాలాజీ తెలిపారు. విద్యుత్ పనులకు సంబంధించి
ఇపిడిసిఎల్ సి.ఎం.డి. పృథ్వీతేజతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తున్నందున ముందస్తుగా నిధుల కోసం కోరకుండా మంజూరైన పనులు వెంటనే చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ విషయమై రాష్ట్ర స్థాయిలో అధికారులతో మాట్లాడతామన్నారు. గడపగడపకు కార్యక్రమంలో పనులు చేపట్టేందుకు అవసరమైన సిమెంటు కోసం పనులు చేపట్టేవారితో డి.డి.లు తీయించాలని చెప్పారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం పనులకు బిల్లుల చెల్లింపుపై
కూడా మంత్రి సమీక్షించారు. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడారు. జిల్లాలో గడపగడపకు మన ప్రభుత్వం కింద 1055 పనులు మంజూరు చేయగా 858 ప్రారంభించడం జరిగిందని పంచాయతీరాజ్ ఎస్.ఇ. గుప్తా వివరించారు. 83 బిల్లులు అప్లోడ్ చేశామన్నారు.
ఉపాధిహామీ, గడపగడపకు మనప్రభుత్వం కింద చేపట్టిన పనులు ఎలా జరుగుతున్నాయో తరచుగా మండలాల్లో పర్యవేక్షించాలని డిపిఓ శ్రీధర్రాజా, జిల్లాపరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. రాజ్కుమార్లను మంత్రి ఆదేశించారు.జిల్లాలో ధాన్యం సేకరణ పరిస్థితిపై మంత్రి పౌరసరఫరాల అధికారులు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తో చర్చించారు. రబీ సీజనులో జిల్లాలో పెద్దగా లక్ష్యాలేమీ నిర్దేశించలేదని జె.సి. పేర్కొన్నారు.
ఉపాధి హామీలో మొదటి స్థానంలో నిలిచినందుకు అభినందన…!
ఉపాధిహామీ పనుల్లో జిల్లా జాతీయ స్థాయిలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని మంత్రి పేర్కొంటూ అధికారులను అభినందించారు. ఉపాధి పనుల్లో మన జిల్లా ప్రతిఏటా ఉత్తమ పనితీరును కనబరుస్తోందని, అదే పంథాను కొనసాగిస్తూ ఈ ఏడాది జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు.
ఈ సమావేశంలో జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్, ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సిపిఓ బాలాజీ, పంచాయతీరాజ్ ఎస్.ఇ. గుప్తా, గ్రామీణనీటి సరఫరా ఎస్.ఇ. ఉమాశంకర్, ఇపిడిసిఎల్ ఎస్.ఇ. నాగేశ్వరరావు, డ్వామా పి.డి. ఉమాపరమేశ్వరి, మునిసిపల్ సహాయ కమిషనర్
ప్రసాదరావు, మునిసిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, పౌరసరఫరాల సంస్త మేనేజర్ మీనాకుమారి, డి.ఎస్.ఓ. మధుసూదనరావు, డిప్యూటీ సిఇఓ రాజ్కుమార్, డిపిఓ శ్రీధర్రాజా తదితరులు పాల్గొన్నారు.