కొన్ని లోపాలు సరిదిద్దుకొని సర్దుబాటు చేసుకుంటే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టు కోవచ్చునని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో మంగళవారం రుక్మిణీ కళ్యాణ మండపంలో జరిగిన కోవూరు ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకున్నారని తెలిపారు.
అందుకే ప్రజలు ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. ఆత్మకూరు లో కూడా ఇటీవల మంచి మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు. దీనిని కొన్ని పత్రికలు వక్రీకరిస్తున్నారని, అది నిజం కాదని తెలిపారు. జగన్ పాలనలో సంక్షేమం మాత్రమే ఉంది, అభివృద్ధి లేదని అంటున్నారని, ఇది నిజం కాదని అన్నారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయడం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ సభ నిర్వహించిన తనదైన క్రమశిక్షణతో చేస్తారని ప్రశంసించారు. ప్లీనరీలో 8 అంశాలను ప్రతిపాదించి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి , చిరంజీవి రెడ్డి, చలపతి తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.