వ్యవసాయ పనులలో తీరిక లేకుండా ఉంటున్న రైతులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలంలో వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు.
కాగా పంటల ఎదుగుదలకు కావాల్సిన యూరియా కరోనా నేపధ్యంలో సరఫరా లో తీవ్ర ఆలస్యం అవుతుంది. మండల కేంద్రం లోని మన గ్రోమోర్ కేంద్రానికి గత నెల జూన్ 15న ఒక లారీ లోడ్ వచ్చిన యూరియా నెల రోజుల అనంతరం నేడు మరొక లోడ్ రావడంతో సమాచారం అందుకున్న రైతులు పెద్దఎత్తున మనగ్రోమోర్ కేంద్రానికి చేరుకుని క్యూ కట్టారు.
మండలంలో ఉన్న రైతులకు సరిపడా యూరియా సరఫరా కాకపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా అయిపోతుందన్న ఆతృతతో యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
సామాజిక దూరం పాటించడం లేదు
కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపద్యంలో ప్రతి ఒక్కరు భాద్యత వహించాల్సి ఉంది. ఎరువుల కేంద్రం దగ్గర క్యూ కట్టిన రైతాంగం ఏ మాత్రం కరోనా కట్టుబాట్లని పాటించడం లేదు.
ఎరువులు దొరుకుతాయో లేదో అన్న నెపంలో కరోనా నియమాలకు తిలోదకాలిస్తూ ప్రమాదాన్ని కొనితెచ్చుకొంటున్నారు. యూరియా అమ్మకం దారులు రైతులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.