ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా నియంత్రణలో భాగంగా వనపర్తి జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు, అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
శుక్రవారం పెబ్బేరు పరిధిలో ఆయా కాలనీలు సందర్శించి, ఇంటింటి జ్వరం సర్వేని జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, వార్డుల వారీగా టీమ్ లను ఏర్పాటు చేసి, ప్రతి రోజు ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని ఆయన సూచించారు.
సర్వే టీమ్ లు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ఎవరైన దగ్గు, జలుబు, జ్వరం వంటి కోవిడ్ లక్షణాలతో బాధపడే వారుంటే వారిని గుర్తించి, హోమ్ ఐసోలేషన్ కిట్ లను అందించుటకు అన్ని చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు ఆయన ఆదేశించారు.
ఇంటింటి సర్వే టీమ్ లలో ఆశా వర్కర్ లు, ఏ.ఎన్.ఎం.లు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, గ్రామ పంచాయతి సిబ్బందితో టీమ్ లను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. 5 రోజులకు మించి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్పించి, వ్యాధి నివారణకు అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు ఆయన సూచించారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18 సం.లు నిండిన వారికి మొదటి, రెండవ డోసులు, 15-17 సంవత్సరముల వారికి మొదటి డోస్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ సత్వరమే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అర్హులైన వారందరికి వంద శాతం వ్యాక్సినేషన్ నిర్వహించాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టెస్టింగ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్, మందుల నిల్వలు ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా నియమాలను పాటించి, కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్ పర్సన్, మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్