కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించేందుకు విజయనగరం జిల్లా ఎస్పీ రాత్రి నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అప్పటివరకు డీపీఓలో హెచ్ సీల బదిలీల పనిలో నిమగ్నమైన ఎస్పీ రాత్రి అయ్యేసరికి నగర రోడ్లపైకి తనిఖీల కై వచ్చారు.
ఇందులో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి నగరంలోని మయూరి జంక్షన్, ఎత్తుబ్రిడ్జి, వి.టి. అగ్రహారం, వై జంక్షన్లలో పర్యటించి కర్ఫ్యూ అమలు చేసేందుకు విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి, అధికారులకు వాహన తనిఖీలు చేపట్టాలని, అత్యవసర వైద్య అవసరాల నిమిత్తం వచ్చిన వారికి మాత్రమే విడిచి పెట్టాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా ఎస్పీ నగరంలోని వై జంక్షన్ వద్ద స్వయంగా వాహన తనిఖీలు చేపట్టి కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్న వారిని ఆపి కారణాలు తెలుసుకొని, కర్ఫ్యూ అమలు సమయంలో అనవసరంగా వాహనాలమీద రోడ్ల పై తిరగరాదని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – కర్ఫ్యూ అమలు సమయంలో ముందస్తు
అనుమతులు లేకుండా వాహనదారులు ఎవ్వరూ తిరగవద్దని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు. కరోనా నియంత్రణకే కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్న విషయాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు. మరికొద్ది రోజులు కరోనా నియంత్రణకు ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తే వ్యాధి వ్యాప్తిని మరింత తగ్గించవచ్చునన్నారు.
కేసుల నమోదు సంఖ్య ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అత్యవసర పనుల నిమిత్తం కర్ఫ్యూ సమయంలో జిల్లాలోను, రాష్ట్రంలోను బయటకు వెళ్ళే వాహనదారులు తప్పనిసరిగా ఈ-పాస్ ను తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం దృష్ట్యా ప్రతీ ఒక్కరూ సోషల్ డిస్టన్స్, డబుల్ మాస్క్ ధరించే విధంగాను, పోలీసు సిబ్బందిని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశించారు.