ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కారణంగా ఎటువంటి ఉపాధి లేకుండా ఉన్న ఆటో డ్రైవర్లు , టాక్సీ డ్రైవర్లపై ఫైనాన్షియర్ల ఒత్తిళ్లను అరికట్టాలని యునైటెడ్ బహుజన పోరాట సమితి(యుబిపిఎస్) జాతీయ కన్వీనర్ కరణం తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు.
కరోనా వైరస్ కారణంగా ట్రాన్స్ పోర్టుపై ఆధారపడి జీవిస్తున్న వారంతా ప్రస్తుతం ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నారని , ఏ రోజుకా రోజు సంపాదించుకుని జీవించే వారిని వాయిదాలు చెల్లించాలంటూ ఫైనాన్షియర్లు బలవంతం చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
కరోన, లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు ఆటో టాక్సీలకు సంబంధించిన ఫైనాన్స్ కాలానికి వడ్డీ తీసుకోవద్దని, ఈ కాలాన్ని ఫైనాన్స్ కాలంగా పరిగణించవద్దని కోరారు. ఈ పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనీ కాకుండా తెలంగాణ తో పాటు యావత్ దేశం లోని అన్నీ రాష్ట్రాల్లో ఉందన్నారు.
అంతే కాకుండా చిరు వ్యాపారులు రోజు వారి వడ్డీకి అప్పులు తీసుకొని జీవనం సాగిస్తారని వారికి కూడా వెసులుబాటు కల్పించాలని తిరుపతి నాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
కరోనా వైరస్ కారణంగా డ్రైవర్ల ఉపాధికి కూడా గండి పడిందని, ఆకలి తీర్చుకునేందుకు కూడా వారి వద్ద డబ్బుల్లేని సమయంలో ఫైనాన్స్ కంపెనీలు వాయిదాలు చెల్లించమనడం ఆవేదనకు గురి చేస్తోందన్నారు. ఫైనాన్స్ కంపెనీలు కూడా ఈ విషయంలో ఆలోచించాలని కోరారు.