అక్కన్నపేట్ నుండి మెదక్ కు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను యుద్ధప్రాతిపదికన రాబోయే నాలుగైదు మాసాలలో పూర్తి చేసేలా చూడాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు రైల్వే అధికారులకు సూచించారు. రైల్వే లైన్ పనులు చివరి దశలో ఉన్నాయని, ఇంకా ఐదు శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఇందుకు 25 కోట్లు అవసరమని రైల్వే డివిజనల్ ఇంజనీరు సధర్మ తెలుపగా వెంటనే నిధులు విడుదల చేస్తామని అన్నారు.
ఆదివారం నాడు మెదక్ పట్టణంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, కోటి 35 లక్షలతో జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబ్ ను ప్రారంభించారు. అనంతరం రైల్వే, రెవిన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో మెదక్ రైల్వే లైన్, సాగునీటి ప్రాజెక్ట్ ల పురోగతిని అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే లైన్ నిర్మాణానికి గత మార్చి లో 40 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రైల్వే కు ఇచ్చామని, మరో 25 కోట్లను వెంటనే మంజూరు చేస్తామని, పనులను త్వరితగతిన చేపట్టి వేగవంతం చేసి దసరా నాటికి రైల్వే స్టేషన్ ప్రారంభించేలా చూడాలని రైల్వే అధికారులను కోరారు.
అనంతరం ఘనపురం ఆనకట్ట,హల్ది వాగు ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తూ ఘనపురం ఆనకట్ట ప్రాజెక్ట్ 1. 725 మీటర్ల ఎత్తు పెంచుటలో భాగంగా భూ సేకరణకు గతంలో 5 కోట్లు మంజూరు చేసామని, భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయుటకు మరో 8 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నామని తద్వారా నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుకొని మరికొన్ని వేల ఎకరాలు సాకులోకి తేవచ్చని అన్నారు.
కొల్చారం వైపు కూడా మరికొంత భూమి సేకరణకు ఎంత డబ్బు కావాలో సమీక్షించి తొందరగా అవార్డు పాస్ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపవలసినదిగా జిల్లా కలెక్టర్ హరీష్ ను ఆదేశించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఘనపురం ప్రధాన కాలువ లైనింగ్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాం.
కాలేశ్వరం నీళ్ల ద్వారా చిట్టా చివరి భూములకు కూడా సాగునీరందిన్చుటకు ఇంకా మిగిలిపోయిన టేలేండ్ లో ఉన్న ప్రదానామైన కాలువలతో పాటు, దిస్త్రిబ్యుటరి నెట్ వర్క్ లైనింగ్ చేయడం కోసం 55 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వం పంపామని అన్నారు. హల్దీ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం, కాలువలు, సిమెంట్ లైనింగ్ కోసం 25 కోట్ల రూపాయల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఘనపురం, హల్ది ప్రాజెక్ట్ లకు సంబంధిని నిధుల మంజూరుకు కృషి చేస్తామని అన్నారు.
హల్ది ప్రాజెక్టు మీద 6 చెక్ డాం లు, మంజీరా మీద 9 చెక్ డాం ల నిర్మాణం చేపట్టి ఇంతవరకు 7 చెక్ డాములు నిర్మించామని, మిగిలిన చెక్ డాములను కూడా యుద్దప్రాతిపదికన ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను రెండు, మూడు రోజులల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కరోన పరీక్షల కోసం జిల్లాలో రాపిడ్ టెస్టులు మాత్రమే చేసేవారని అందులో భాగంగా జిల్లాలో ఆర్టీపిసీఆర్ ల్యాబ్ ను ఈరోజు ప్రారంభించామని, రేపటి నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని దీనిని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్, రెమిడిసివిర్, మందుల కొరత ఉన్నదా అని వైద్యాదికారులను అడిగారు. రోగుల దగ్గరకు వెళ్లి ఆత్మీయతతో పలకరించండని, అదే వారికి సగం ధైర్యం ఇస్తుందని అన్నారు.
అనంతరం పిల్లి కొట్టాల్ లో నిర్మిస్తున్న ఎ.సి.హెచ్. ఆసుపత్రి కి వెళ్ళే రహదారిని పరిశీలించి వెడల్ప్లుగా బి.టి. రోడ్డు నిర్మించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ యస్. హరీష్, అదనపు కలెక్టర్ జి.రమేష్, పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు శేరి సుబాష్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, ,జెడ్పి వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీనివాస రావు , ఆర్.డి.ఓ. సాయి రాం, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.