వచ్చే నెల 9,10తేదీలలో విజయనగరం జిల్లా ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా అక్టోబర్ 09, 10వ తేదీల్లో స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు నిర్వహించబోయే శాస్త్రీయ, లలిత సంగీత పాటల ప్రదర్శనలకు సంబంధించిన ఏర్పాట్లపై నిర్వహణ కమిటీ సభ్యులు చర్చించారు.
ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేసుకొని ప్రదర్శనలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. దీనిలో భాగంగా సంబంధిత ప్రదర్శనల నిర్వహణ కమిటీ సభ్యులు సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో డీఐపీఆర్వో రమేష్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.
కమిటీ సభ్యులైన మార్కెటింగ్ శాఖ ఏడీ శ్యామ్ కుమార్, ఆడిట్ ఆఫీసర్ అరుణ కుమారి, మాజీ కౌన్సిలర్ కాశీ విశ్వేశ్వరుడు, కాశీ అనంత లక్ష్మి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. పోటీల నిర్వహణకు సంబంధించిన నియమావళిని రూపొందించి దాని ప్రకారం ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రదర్శనలను నిర్వహించాలని సభ్యులు పేర్కొన్నారు. సంగీత ప్రదర్శనలకు వచ్చే కళాకారులకు సత్కారం చేసి, జ్ఞాపిక బహుకరించాలని నిర్ణయించారు.
పోటీలలో 15 నుండి 45 ఏళ్ల వయసు కలిగిన స్త్రీ పురుషులు అర్హులని, ఔత్సాహికులు ఈ నెల 30వ తేదీ సాయంత్రంలోగా కలెక్టరేట్ లో ఉన్న జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో నేరుగా లేదా diprovizianagaram@gmail.com మెయిల్ కు ఆన్లైన్ దరఖాస్తులు పంపవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9121215263 మొబైల్ నెంబర్ ను సంప్రదించాలని సభ్యులు ఈ సందర్భంగా సూచించారు. సమావేశంలో డివిజనల్ పీఆర్వో ఎస్. జానకమ్మ, ఏపీఆర్వో డి. నారాయణరావు పాల్గొన్నారు.