తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధులు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎం.ఎల్.ఎ. కొండపల్లి లక్ష్మినర్సింహారావు (కె.ఎల్.) ఎన్నటికీ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సాధనలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కొనియాడారు. సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన కె.ఎల్ 12వ వర్థంతి సభ కార్యక్రమం జరిగింది. ఈ వర్థంతి సభలో నున్నా మాట్లాడుతూ, తొలితరం కమ్యూనిస్టు యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నామకరణం చేసినవారు, సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచిత పాత్ర పోషించిన వారు, ప్రజా ప్రతినిధిగా రాష్ట్ర అభివృద్ధికి అనేక సూచనలు అందజేసినవారు, అనేక నిర్భంధాలను మొక్కవోని విశ్వాసంతో ఎదుర్కొని కేడర్లో ఉత్తేజం నింపిన కె.ఎల్. గారు నిరంతర స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులను పార్టీతో కొనసాగించడంలోనూ, అవకాశం వున్న సౌఖ్య సుఖాలను అనుభవించకుండా కష్టాలను ఎదుర్కొని సమ సమాజ స్థాపన కోసం పాటుబడిన వ్యక్తి కె.ఎల్. గారు అని పేర్కొన్నారు. ఆయన బాటలో నడవడమే ఆయనకిచ్చే నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పోన్నం వెంకటేశ్వరరావు,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్,బండి పద్మ, యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, దొంగల తిరుపతిరావు, అఫ్రోజ్ సమీనా,పి.ఝాన్సీ, పి.రమ్య, ఆర్.ప్రకాష్, జిల్లా నాయకులు టి.లింగయ్య,కె.దేవేంద్ర, ఎస్.కె.మీరా, సుదర్శన్, కుటుంబరావు,ఐ.వి రమణారావు, గౌస్, క్రాంతి శ్రీనివాస్ రావు, జక్కంపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
previous post