నెల్లూరు లో ” ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ ” కార్యక్రమాన్ని నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర జిల్లా స్థాయి యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 75 వారాల పాటు “అజాది కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ” ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ ” నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం అవ్వాలని ఆయన కోరారు. 2047 లో దేశం ఎలా ఉండాలి అని యువత తమ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయవచ్చునని, మన స్వాతంత్ర సమరయోధుల సందేశాలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
ప్రపంచంలో భారత్ ఒక గొప్ప దేశంగా ఎదగాలి. అందుకు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా మరియు విద్యాపరంగా అభివృద్ధి చెందాలి. ప్రపంచంలో అత్యధిక యువ శక్తి కలిగిన దేశం మనది. నవ భారత నిర్మాణంలో ఈ యువత పాత్ర కీలకమైనది. ప్రపంచం పటంలో భారత్ ఒక విశ్వగురువుగా నేడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవతరించబోతోంది అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.