గంజాయి లాంటి మత్తు పదార్ధాలు సరఫరా చేస్తూ ఐదుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని సిరసపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఈ సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు మత్తు పదార్ధాలు సరఫరా చేస్తున్నారని సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో సిరసపల్లి X రోడ్ వద్ద ఎస్ ఐ బి శ్రీనివాస్ తన సిబ్బందితో కాపుకాశారు.
అక్కడకు వచ్చిన వాహనాలు తనిఖీ చేస్తుండగా జమ్మికుంట నుండి హుజురాబాద్ వైపు వస్తున్న మారుతి షిఫ్ట్ డిజైర్ TS 02 FA 1143 లో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిలో హుజురాబాద్ వాసులు కాపర్తి అనిల్ కుమార్, గందే సాయి, కొలిపాక శ్రీనివాస్, గోదావరిఖని వాసులు కొలనుపాక శ్రీధర్, గుడికందుల ఆజేందర్ ఉన్నారు.
వీరంతా 10 ప్లాస్టిక్ సంచులలో అంబర్ ప్యాకెట్లు ఒక సంచిలో 100 అంబర్ ప్యాకెట్ లు, ఒక చిన్న సంచిలో 750 గ్రాముల గంజాయి తీసుకువెళుతున్నారు. హుజూరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముకుని లాభం పొందాలని వారు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఐదుగురు పట్టుబడిన వెంటనే మండల తాసిల్దార్ కు విషయం తెలియపరిచి ఆయన సమక్షంలో పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.