మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఫ్లేవర్డ్ మిల్క్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ ఉన్నతాధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి జగన్ మహిళ, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాడు – నేడు పథకానికి రూ.3,364 కోట్లు కేటాయించామని, జనవరిలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు అన్ని వసతులు సమకూర్చాలని, కర్నూలు పశ్చిమప్రాంతంలోని హాస్టళ్లకు మొదటగా ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి సీఎం ఆమోదం తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరణకు ఒక నంబర్ కేటాయించాలని జగన్ ఆదేశించారు.