జీహెచ్ఎంసీలో 5 లక్షల 80 వేల పై చిలుకు రేషన్ కార్డులున్నాయి. కాగా వరద సహాయం అందించేందుకు ఇంతమందికి 580 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం 500 కోట్లను విడుదల చేసింది. అవసరం అయితే మరిన్నినిధులను కూడా విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నా నగరంలో సుమారు వరద సహాయం 90 శాతం మందికి అందాల్సింది. ఒకవేళ అంతమందికి అందితే ఇప్పుడు వరద సహాయం అందలేదని మీసేవాల్లో దరఖాస్తు చేస్తున్నవారంతా ఎందుకు చేస్తారనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అంటే ఆయా వరద సహాయాన్నిప్రతిపక్షాలు, ప్రజలు అప్పట్లో ఆరోపించినట్లుగా నిజంగానే గులాబీ నేతలు, అధికారులు, అనుచరగణాలు దండుకున్నారనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. ఫలితమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనిపించింది. ఏది ఏమైనప్పటికీ అలాంటి నేతలు, నేతలతో కుమ్మక్కైన అధికారులు, ఆయా నేతల అనుచర గణాలలపై సీఎం కేసీఆర్ ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది మరో అంశం ఉంది. ఏంటంటే వరద బాధితుల విషయంలో సీఎం కేసీఆర్ ఉదారత చాటినప్పటికీ పార్టీకి చెందిన నేతలే వరద సహాయం కాస్త బొక్కేసి ఓటమికి కారకులయ్యారనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.
సీఎం కేసీఆర్ ఈ విషయంలో సీరియస్గా ఆలోచిస్తారో? లేదా సిల్లీగా తీసుకొని వదిలేస్తారో? వేచి చూడాల్సిందే. కాకుంటే ప్రజలు మాత్రం ఈ సారి కూడా వరద సహాయంపై ఇప్పటికీ గుర్రుగానే ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. లేకుంటే 7వ తేదీ తరువాత అందరికీ అందజేస్తామన్నప్రభుత్వ ప్రకటనపై ఉదయం 4 గంటల నుంచే ప్రజలు లైన్లలో నిల్చున్నారంటే వారు వరద సహాయంపై పెట్టుకున్నఆశలు, భావోద్వేగాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరిక ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.