రాజభోగం అనుభవించడానికి కూడా రాసి పెట్టి ఉండాలి అంటారు. నిజమే. అది అందరికి సాధ్యం కాదు. కొందరికి మాత్రమే రాజభోగం అనుభవించే అర్హత ఉంటుంది. అలాంటి అర్హత ఉన్న వారిలో గత ఆరు నెలల్లో ఇద్దరు వెలుగులోకి వచ్చారు. ఒకరు చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా.
కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత రాజభోగం అనువిస్తూ ఫొటోలు తీసుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే ఆర్ కె రోజా గురించి తెలుకుసుకోవాలంటే ఈ ఏడాది ఏప్రిల్ లోకి వెళ్లాలి. అప్పటికి కరోనా పీక్ స్టేజిలో ఉంది. ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లారు.
పుత్తూరు మునిసిపాలిటీలోని ఐదో వార్డులో బోరింగును ప్రారంభించడం అనే ముఖ్య కార్యక్రమానికి ఆమె వెళ్లారు. చేతికి గ్లౌజెస్ తో ఆమె ఎంతో పకడ్బందిగా పర్యటించారు. నోటికి మాస్క్ కూడా ఉందండోయ్. అధికారంలో ఉన్నప్పుడు ఊరికనే ఊరికి వెళితే ఏం బాగుంటుంది….
అందుకే రోడ్డుకు ఇరు పక్కలా జనాన్ని నిలబెట్టి మరీ కాళ్లపై పూలు చల్లించుకున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో మేడం కాళ్లపై వారు పూలు చల్లారు. ఇప్పుడు తాజాగా నాకేం తక్కువ అంటున్నారు హోం మంత్రి మేకతోటి సుచరిత. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం తక్కెళ్లపాడు గ్రామంలో ఆమె పర్యటించారు.
గ్రామంలోని డాక్టర్ బీ.ఆర్.అంబెద్కర్ విగ్రహానికి హోంమంత్రి పూలమాల వేశారు. తక్కెళ్లపాడు గ్రామంలో మండేపూడి డేవిడ్, సుబ్బారావు లకు చెందిన FSH & సర్వీస్ వాటర్ ప్లాంట్ ను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్య, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
అత్యంత ముఖ్యమైన ఈ కార్యక్రమంలో హోం మంత్రి పూలు చల్లించుకున్నారు. దారి పొడవునా జనం నిలబడి పూలు చల్లుతుంటే హోం మంత్రి ఎంతో నిగర్వంగా నడుచుకుంటూ వెళ్లారు. కరోనా రెండో దశ వస్తుందని సాటి మంత్రులు చెబుతున్నందునేమో నోటికి మాస్కు వేసుకున్నారు కానీ చేతికి రోజాలా గ్లౌజెస్ వేసుకోలేదు.
కాళ్లపై అచ్చు రోజా లానే పూలు మాత్రం చల్లించుకున్నారు. ఏమాట కామాటే చెప్పుకోవాలి. ఆమె అలా నడిచి వస్తూ కాళ్లపై పూలు చల్లించుకుంటుంటే అధికార దర్పం ఉట్టిపడింది. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా రోడ్డుపై పూలు చల్లించుకుంటూ నడుస్తూ ఉంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది.
మిగిలిన మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులూ కూడా ఈ సంఘటనలతో స్పూర్తి పొంది కాళ్లపై పూలు చల్లించుకోవాలని అభిమానులు కోరుతున్నారు.