విజయనగరం జిల్లా రైతాంగం పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చేయడం, రైతులు పండించిన పంట ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ చెప్పారు.
జిల్లాలో రైతులు వరి, మొక్కజొన్న పంటలను అధికంగా పండిస్తున్నారని, ఈ పంట ఉత్పత్తులను జిల్లాలోనే తగిన విధంగా ప్రాసెస్ చేసి వాటి విలువ పెంచేవిధంగా వ్యవసాయ శుద్ధిపరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు పెరగడంతోపాటు ఇటీవలి కాలంలో సాగునీటి సౌకర్యాలు పెరగడంతో వరి, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్నారని వాటికి జిల్లాలోనే ప్రాసెసింగ్ చేసి ప్రతి ఏటా గిట్టుబాటు ధర సమస్యలు లేకుండా ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాదికల్లా వీటిని ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్పారు.
తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 1.30 లక్షల పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందాలనే ఉద్దేశ్యంతో ప్రాజెక్టు ఫలాలు అందరికీ చేర్చే ఉద్దేశ్యంతోనే ఈ పనులను చేపట్టాల్సిన అవసరాన్ని సీఎం కు వివరించి నిధులు మంజూరు చేయించామని మంత్రి తెలిపారు.జిల్లా లో బొబ్బిలి మండలం పిరిడి వద్ద తోటపల్లి ప్రాజెక్టులో ఇంకా మిగిలిపోయి వున్న బ్రాంచి కాలువల నిర్మాణం పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర జలవనరుల శాఖ 58.59 కోట్లను ఈ పనుల కోసం మంజూరు చేసింది. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు కింద ప్రస్తుతం చేపడుతున్న బ్రాంచి కాలవల పనులను ఆరు నెలల నుంచి ఏడాదిలోగా పూర్తిచేసేందుకు నిర్మాణ సంస్థ అంగీకరించిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
తోటపల్లి బ్యారేజ్ వద్ద మొదటి పదికిలోమీటర్ల పరిధిలో వున్న కుడికాలువ బలహీనంగా వుందని, దానిని పటిష్టపరచాల్సి వుందని సీఎం జగన్ కు నివేదించగా ఆ పనులకు కూడా త్వరలో ఆమోదం లభిస్తుందన్నారు. మరో వారం రోజుల్లో తోటపల్లి రెండో ప్యాకేజీ పనులను కూడా నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో ప్రారంభిస్తామన్నారు.
బ్రాంచి కాల్వ పనులతో పాటు బొబ్బిలి మండలంలోని పిరిడి, అలజంగి, కోరాడ తదితర గ్రామాలకు పైపుల ద్వారా తోటపల్లి నీటిని అందించేందుకు కూడా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కష్టం కలగకుండా చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏ రైతుకు సమస్య వచ్చినా అది తన సమస్యగా భావించి ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కృషిచేస్తుందన్నారు. రాష్ట్రంలో పండించిన ప్రతి పంటకు మద్ధుత ధర కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున సాగునీటి సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చి తోటపల్లి పనులను చేపడుతున్నట్టు చెప్పారు.
ఈ ప్రాంతంలోని చెరకు రైతులకు ప్రైవేటు చక్కెర కర్మాగార యాజమాన్యం నుంచి గతంలో 24 కోట్ల బకాయిలు గతంలో చెల్లించేలా చర్యలు చేపట్టామని, మిగిలి వున్న బకాయిలను కూడా చెల్లించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. చెరకు రైతులు కొద్దికాలం ఓపికతో వుంటే మిగిలిన బకాయిలు కూడా చెల్లించే ప్రయత్నాలు చేస్తామన్నారు.
ఇప్పటికే చెరకు రైతులు నష్టపోకుండా సంకిలిలోని ప్రైవేటు చక్కెర కర్మాగారంతో మాట్లాడి వారు ఇక్కడి రైతుల నుంచి చెరకు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. దీని ఫలితంగా ఇప్పటివరకు సంకిలి ఈ.ఐ.డి. చక్కెర కర్మాగారం ఇక్కడి రైతుల నుంచి 35 వేల టన్నుల చెరకు తీసుకువెళ్లిందని 9.50 కోట్లు రైతులకు చెల్లించిందని చెప్పారు.
జిల్లాలో రైతులు పండించిన చెరకు చివరి టన్ను వరకు కొనుగోలు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసమే ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తోందని మంత్రి బొత్స చెప్పారు. ప్రజల చెంతకే పాలన తీసుకువెళ్లే ఉద్దేశ్యంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. భూములపై వివాదాలకు తావులేకుండా వందేళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే చేయిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు చివరి భూముల వరకు సాగునీటిని అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు పనుల కోసం సీఎం 120 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. జిల్లాలో జైకా నిధులు 175 కోట్లతో దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పెద్దగెడ్డ, వెంగళరాయ సాగర్, ఆండ్ర, వట్టిగెడ్డ, పెదంకలాం వంటి ప్రాజెక్టుల ఆధునీకరణ చేపట్టిన ఘనత మన సీఎంకే దక్కుతుందన్నారు.
2004లో సీఎం వైఎస్సార్ హయాంలో చేపట్టిన తోటపల్లి ప్రాజెక్టు పనులను ఆయన కొడుకుగా సీఎం జగన్ తన హయాంలో పూర్తిచేసేందుకు సంకల్పించారని మంత్రి బొత్స పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ జిల్లా రైతాంగం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరుతుండటం ఎంతో సంతోషదాయకమన్నారు.
జిల్లాలోని రైతులు తమ భావితరాలకు, వారసులకు సా తక్కువ పెట్టుబడితో రసాయనిక ఎరువులు వినియోగించకుండా వుండే ప్రత్యామ్నాయ సాగు విధానాల వైపు మళ్లాలని కోరారు.ఈరోజు చేపట్టిన ప్యాకేజీ -1 పనుల ద్వారా బొబ్బిలి, పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 20వేల 521 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినప్పల నాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకర్ రావు, సబ్ కలెక్టర్ భావన, బొబ్బిలి మునిసిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, పలువురు ఎంపిపిలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.