తెలంగాణలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
ఇందులో భాగంగా రైస్ బ్రాన్ ఆయిల్ (తవుడు నూనె) మిల్లులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దీనితో పాటు సాల్వేంట్ ఆయిల్ మిల్లుల ఏర్పాటుకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. సాల్వేంట్ మిల్లుల సంఘం ప్రతినిధులు మారం ప్రసాద్, పాలకుర్తి చినబాబు, మిషనరీ తయారిదారుడు ఆనంద మోహన్, తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు గంప నాగేందర్ లతో మంత్రి హైదరాబాద్ లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సాల్వేంట్ ఆయిల్ మిల్లుల ప్రతినిధులు రైస్ బ్రాన్ ఆయిల్ తయారీ విధానాన్ని మంత్రికి వివరించారు. రైస్ బ్రాన్ ఆయిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.
రక్త పోటును అదుపు చేయడంతో పాటు తక్కువ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉన్న నూనెల్లో రైస్ బ్రాన్ ఆయిల్ అని మంత్రికి వారు వివరించారు. అందుకే వీటి ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసిఆర్ భావిస్తున్నారని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు తెలంగాణ వ్యాప్తంగా త్వరలో ఏర్రాటుచేయనున్న ఫుడ్ ప్రాసెస్ంగ్ జోన్లలో రైస్ బ్రాన్ ఆయిల్, సాల్వేంట్ ఆయిల్ రెఫైనరీలను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసిఆర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ రాష్ర్టంగా అయ్యిందని ఆయన అన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు ఇప్పటికే ప్రాంతాలను గుర్తించడం జరిగిందని గంగుల కమలాకర్ చెప్పారు. వీటిలో పెద్దఎత్తున పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నదని ఆయన తెలిపారు.