పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్ లోని విశ్వవిద్యాలయాలలో చెలరేగుతున్న నిరసనలకు విదేశీ విశ్వవిద్యాలయాలలోని భారత విద్యార్ధులు సంఘీభావం తెలిపారు. విద్యార్ధులు చేస్తున్న శాంతియుత ఉద్యమంపై పోలీసుల అణచివేత విధానాలను నిరసిస్తూ వారు ప్రదర్శన జరిపారు.
అమెరికాలోని హార్వర్డ్, యేల్ విశ్వవిద్యాలయాల నుండి 400 మందికి పైగా విద్యార్థులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొలంబియా, న్యూయార్క్, స్టాన్ఫోర్డ్, మిచిగాన్, బ్రౌన్, చికాగో వంటి విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్ధులు కూడా భారతీయ విద్యార్ధులకు సంఘీభావం వ్యక్తం చేశాయి.
“రాజ్యాంగ విరుద్ధమైన, మత వివక్షతతో కూడిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన భారతదేశంలోని ప్రతి విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంఘీభావం” అని వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. జామియా, అలీఘర్ విశ్వవిద్యాలయ ప్రాంగణాల నుండి పోలీసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన అమానుష దాడిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయాలని ఈ ప్రకటనలో కోరారు.