ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్, అటవీశాఖ కార్యదర్శి ద్వివేదీ అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి గరం సడక్ యోజన, రోడ్ ప్రోగ్రాం పథకాల కింద విజయనగరం జిల్లాలో 15 రహదారులకు అటవీ క్లియరెన్స్ రావలసి ఉందని, ఈ నెలాఖరు నాటికి జిల్లా స్థాయి పనులన్నీంటినీ పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎం.హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు. పంచాయితీ రాజ్ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ గోయల్, కార్యదర్శి ద్వివేదితో కలసి జిల్లా కలెక్టర్లతో రహదారులకు ఫారెస్ట్ క్లియరెన్స్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమన్వయం చేయాలనీ, నిబంధనలను పాటిస్తూ క్లియరెన్స్ త్వరగా వచ్చేలా చూడాలని కలెక్టర్లను కోరారు. అటవీ భూములకు ప్రత్యామ్నాయ భూములను ఇచ్చే విషయంలో చొరవ చూపాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన 15 రహదారులకు గాను పి.ఎమ్.జి.ఎస్.వై క్రింద ఎస్.కోట వద్ద దబ్బగుంట టు పల్లపు దుంగాడకు సంబంధించిన రహదారికి అవసరమైన ప్రతిపాదనలు పీ.సీ.సీ.ఎఫ్ కు పంపామని, జి.ఓ రావలసి ఉందన్నారు. మరో ఏడు రహదారులకు మాప్స్ పెండింగ్ ఉన్నాయని వాటిని వారంలోగా క్లియర్ చేస్తామని చెప్పారు. ఒక రహదారి జిల్లా అటవీ అధికారి స్థాయిలో జాయింట్ ఇన్స్పెక్షన్ కు పెండింగ్ ఉందని, మిగిలినవి కూడా ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని తెలిపారు. డిసెంబర్ నెలాఖరు నాటికి జిల్లా స్థాయి ప్రొసీజర్ పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐ.టీ.డీ.ఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్. కుర్మనాద్, డి.ఎఫ్.ఓ సచిన్ గుప్తా, పంచాయతీ రాజ్ ఎస్.ఈ గుప్తా, ఈ ఈ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.