ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గుత్తికోయలు హత్య చేసిన ఘటన మరవకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది.పెనుబల్లి మండలం బ్రహ్మళకుంట శివారులో ఫారెస్ట్ అధికారి బైక్ను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. అది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాళీ బైక్ గా సమాచారం. జంతువుల కోసం వేటగాళ్లు కరెంట్ వైర్లు బిగుస్తున్నారనే సమాచారంతో ఫారెస్ట్ అధికారి అక్కడికి వచ్చినట్లు,అనంతరం పక్కనే వున్న వరి పొలంలో బైక్ని పార్క్ చేసి చుట్టుపక్కల గాలించేందుకు వెళ్లాగా.
ఈ క్రమంలోనే దుండగులు ఆయన బైక్ను దగ్ధం చేసినట్లు,బెండాలపాడు ఘటన మరవకముందే రోజుల వ్యవధిలో మరో ఘటన చోటు చేసుకోవడంతో అటవీ శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోడు భూముల వివాదంలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ నేపథ్యంలో ఆయన హత్యకు బాధ్యులైన ఎర్రబోడు గుత్తికోయలను ఊరి నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామపంచాయతీ తీర్పు వెలువరించింది.గుత్తి కోయల వల్ల తమకు ప్రాణ హాని వుందని అందువల్ల వారిని స్వస్థలమైన ఛత్తీస్గఢ్కు పంపించాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.ఈ మేరకు బెండాలపాడు గ్రామస్తులు పంచాయితీ ఈవోకు తీర్మానం కాపీని అందజేశారు. మరోవైపు విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్ అటవీ అధికారి (ఎఫ్ఆర్వో) చలమల శ్రీనివాస రావు(45) అంత్యక్రియలు నవంబర్ 23న పూర్తయ్యాయి.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపుడిలో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు.ఇదిలావుండగా చాలా కాలంగా తమకు ఆయుధాలివ్వాలని పారెస్ట్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.అడవిలో విధులు నిర్వహించాలంటే ఆయుధాలు కావాలని కోరుతున్నారు.ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదీవాసీలకు, ఫారెస్ట్ సిబ్బంది మధ్య వివాదాలు కాలక్రమేణా పెరుగుతున్నాయి.