బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామంలో దళితులు సాగుచేస్తున్న భూమిని అటవిశాఖ అధికారులు స్వాధీన పరుచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గత యాభై ఏళ్ల నుండి లేని అధికారులు ఇప్పుడెందుకు మేలు కొన్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
1970 లో స్వర్గీయ జుక్కల్ శాసన సభ్యులు విఠల్ రెడ్డి సహకారంతో గ్రామంలోని భూమిలేని నిరుపేదలైన 130 దళిత కుటుంబాలకు ఈ భూములు ఇచ్చారు. దీంతో అదే జీవనాధారంగా భూములను సాగు చేస్తూ పంటలు పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ హఠాత్తుగా హరితహారం ఆరో విడతలో భాగంగా అటవీశాఖ అధికారులు ఆ భూముల్లో అటవీ శాఖకు సంబంధించినవి అందులో మొక్కలు నాటేందుకు భూములు చదును చేయడం పట్ల దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు.
ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం భూములు లేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని ఇస్తామంటూనే భూములు లాక్కోవడం మేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అటవీశాఖ అధికారులు ప్రభుత్వ పెద్దలు స్పందించి తమ భూములు తమకు అప్పగించాలని లేని ఎడల తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని శాంతాపూర్ గ్రామ దళిత కుటుంబాలకు చెందిన వారు అన్నారు.