రాయలేని భాషలో సీఐని తిట్టిన వైనం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఒక మూడు పదుల యువకుడి చేతిలో అసెంబ్లీ ఎన్నికలలో మంత్రిగా ఉంటూ మహేందర్ రెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. మహేందర్ రెడ్డిపై గెలుపొందిన పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఉనికి కోసం సహనం కోల్పోయి వ్యవహరిస్తున్నారు.
తాండూరు నియోజకవర్గంలో క్రమంగా పట్టుకోల్పోతున్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అధికారులను లక్ష్యంగా చేసుకుని బూతు పురాణాన్ని ఎంచుకున్నారు. కొద్ది మాసాల క్రితం గ్రామ పంచాయతీలకు ఫాగింగ్ మిషన్ లను పంపిణీ చేసిన సమయంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి సబితారెడ్డి ముందే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యపై నోరు పారేసుకున్నారు. జిల్లాలో ఎలా పనిచేస్తావో చూస్తానంటూ అదనపు కలెక్టర్ ను బెధిరించారు.
గత కొద్ది రోజులుగా తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ గా వ్యవహరిస్తున్న ఆర్డీఓ అశోక్ కుమార్ ను మాజీ మంత్రి మహేందర్ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నారు. ఎలాగైనా ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తానని.. లేదంటే సస్పెండ్ చేయిస్తానని పలుమార్లు బెధిరింపులకు పాల్పడ్డారు. అనేక మార్లు ఫోన్ లో ఆర్డీఓ అశోక్ కుమార్ పై మహేందర్ రెడ్డి దుర్భాషలాడారు.
రెండు రోజుల క్రితం తాండూరు పోలీసు సర్కిల్ పరిధిలోని యాలాల ఎస్ఐ అరవింద్ కుమార్ పై ఒక సమావేశంలో బహిరంగంగా మహేందర్ రెడ్డి బూతుల పురాణాన్ని వల్లించారు. అరేయ్.. ఎస్ఐ అంటూ గట్టిగా పలుమార్లు సభావేదికపై నుంచి కేకలు వేస్తూ ఎస్ఐను బెధిరించే ప్రయత్నం చేశారు. రంజాన్ కిట్ల పంపిణీ సందర్భంగా బషీరాబాద్ మండల తహసీల్దార్ వెంకటస్వామి పై కూడ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చిందులేశారు. బహిరంగా వేధికపై నుంచి అంతు చూస్తా అంటూ తహసీల్దార్ ను బెధిరించారు.
తాజాగా తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి రాయలేని భాషలో దుర్భాషలాడారు. పరుష పదజాలంతో సీఐని బెధిరించారు. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లినా కూడ వదిలిపెట్టనని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ లో బెధిరించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాటలను పట్టణ సీఐ రికార్డు చేసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతుల పురాణంకు సంబంధించిన ఆడియో సామాజిక మాద్యమాలలో వైరల్ గా మారింది.